న్యూఢిల్లీ : కొవిడ్-19 రోగుల చికిత్సలో వాడే కీలక ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు బ్లాక్ మార్కెట్ కు తరలివెళుతుంటే ఆప్ సర్కార్ యంత్రాంగం వాటిని నిరోధించడంలో విఫలమైందని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖ పల్లితో కూడిన కోర్ట్ ఆక్షేపించింది. ఢిల్లీ ప్రభుత్వం సరఫరా చేసే ఆక్సిజన్ సిలిండర్లపై అకౌంటింగ్ జరగకపోవడంతో ఆక్సిజన్ కొరత, బ్లాక్ మార్కెటింగ్ కు దారితీసిందని పేర్కొంది. ప్రాణాధార మందులు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిని అదుపులోకి తీసుకోవాలని ఢిల్లీ సర్కార్ ను కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి బ్లాక్ దందాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కేవలం రూ వందల విలువ చేసే మందులను ప్రజలు రూ లక్షలు వెచ్చించి బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వల పరిస్థితి నివేదిస్తూ బుధవారం ఉదయం కోర్టుకు నివేదిక సమర్పించాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరింది. రాబందులు సొమ్ము చేసుకునేందుకు ఇది సమయం కాదని, బ్లాక్ మార్కెటింగ్ ఏమాత్రం మానవత్వం కాదని ఆక్సిజన్ రీఫిల్లర్ లకు కోర్ట్ హితవు పలికింది.