యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మిస్తున్న యాదాద్రి క్షేత్రం వడివడిగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కో పనిని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. శనివారం సాయంత్రం యాదాద్రిలో లైటింగ్ డెమో నిర్వహించారు. స్వర్ణకాంతులతో లక్ష్మినరసింహ స్వామి ఆలయం విరాజిల్లుతోంది. స్వర్ణకాంతుల్లో మెరిసిపోతున్న ఆలయ సుందర దృశ్యాలను స్థానికులు తమ కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చోళ, కాకతీయ, పల్లవ శిల్ప కళాకృతులతో… మరెక్కడా లేని తరహలో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దాల తరబడి రాతి చెక్కడాలు జరగాల్సిన పనులను కేవలం నాలుగేళ్లలో దాదాపు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయాన్ని 2.33 ఎకరాల విస్తీర్ణంలో ఆగమ ,శిల్ప వాస్తు శాస్త్రాల ప్రకారం సంపూర్ణంగా కృష్ణ శిలతో రూపొందించారు.
దాదాపు 2.5 లక్షల టన్నుల నల్ల రాతితో అష్ట భుజ మండప ప్రాకారాలు, కాకతీయ కళా రూపాలు, యాలి స్తూపాలు రూపొందించారు. అష్టలక్ష్మి రూపాలతో సాలహారాలు, ఆళ్వారుల విగ్రహాలు, ప్రహ్లాద చరితం… ఉప ఆలయాలతో భక్త జనులను మైమరిపించేట్లు యాదాద్రిశుడి సన్నిధి ఆధ్యాత్మిక నిలయంగా మారింది. మాడ వీధులతో 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం రూపొందింది.
నలువైపుల ఆరు రాజ గోపురాలు నిర్మితమయ్యాయి. ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రంలో 16 రకాల గోపురాలుంటే వాటిలో మూడు రకాల గోపురాలు ఒకేఒక్క యాదాద్రి బృహద్ధాలయంలో ఉన్నాయి. ఈ గోపురాలపై మహావిష్ణువుకు సంబంధించిన 257 విగ్రహాలను పొందు పరిచారు. ఆలయ తొలి ప్రాకారంలో నలువైపులా 93 సాలహారాలు, రెండవ ప్రాకారంలో 52, మాడ వీధిలో 96 సాలహారాలను దేవత మూర్తులు, అష్టలక్ష్మి దేవి రూపాలతో తీర్చిదిద్దుతున్నారు.