మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణాలను చేపట్టింది. రాబోయే తరాల్లో భక్తితత్వం పెంపొందించేలా యాదాద్రి పునర్నిర్మాణం జరిగింది. అనతికాలంలోనే పూర్తిస్థాయిలో ఆలయ పునర్నిర్మాణం అద్వితీయం.
– సీజేఐ ఎన్వీ రమణ
యాదాద్రి భువనగిరి, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)ః సంపూర్ణంగా కృష్ణశిలారూపంలో పునర్నిర్మితమైన యాదాద్రి ఆలయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను అచ్చెరువు పొందేలాచేసింది. ఆలయ పునర్నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించిన జస్టిస్ రమణ.. రాష్ట్ర ప్రభుత్వ కృషిపై ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణాలను చేపట్టిందని కితాబిచ్చారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా ఆలయ నిర్మాణం చేస్తున్నది’ అని విజిటర్స్ బుక్లో రాశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం తొలిసారిగా సందర్శించారు. హైద్రాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరిన జస్టిస్ రమణ 8.45 గంటలకు నేరుగా కొండపైన ఉన్న వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు. అక్కడ అర్చకులు చీఫ్ జస్టిస్ దంపతులకు స్వర్ణ కలశంతో కూడిన పూర్ణకుంభ స్వాగతం పలికారు. జస్టిస్ దంపతులు స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. సుమారు గంటపాటు బాలాలయంలోనే పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జస్టిస్ దంపతులు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయంలోని స్వయంభువులను దర్శించుకొన్నారు. కృష్ణశిలతో నిర్మించిన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, శిల్పుల నైపుణ్యాన్ని జస్టిస్ రమణ కొనియాడారు. రాబోయే తరాలకు భక్తితత్వం పెంపొందించేలా యాదాద్రి పునర్నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు.అందంగా తీర్చిదిద్దిన లైటిం గ్ సిస్టంను చూసి అక్కడే ఉన్న ఆర్కిటెక్ట్ ఆనందసాయిని మెచ్చుకొన్నారు. అనతికాలంలోనే పూర్తిస్థాయిలో ఆలయాన్ని పునర్నిర్మించడం అద్వితీయమన్నారు. సుమారు గంటపాటు నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రెసిడెన్షియల్ సూట్స్తోపాటు పెద్దగుట్టపై నిర్మితమవుతున్న టెంపుల్ సిటీని చూసి అబ్బురపడ్డారు. భక్తులకు ఆధ్మాత్మికతతోపాటు, ఆహ్లాదాన్ని పంచే లా పెంపొందించిన పచ్చదనాన్ని చూసి ప్రశంసించారు. తిరిగి వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ దంపతులు అల్పాహారం చేశాక మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. పట్టువస్ర్తాలు ధరించి సంప్రదాయ రీతిలో జస్టిస్ దంపతులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయంపక్షాన స్వామి అమ్మవార్ల మెమెంటోను జస్టిస్ దంపతులకు మంత్రులు అందజేశారు. పట్టు వస్ర్తాలను దేవాలయ ఈవో గీతారెడ్డి, దేవుడి ప్రసాదాలను అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు. అంతకుముందు సీజేఐకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా సెషన్స్ జడ్జి రమేశ్ వీవీఐపీ అతిథిగృహం వద్ద స్వాగతం పలికారు.