ఒక రాజుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు మంచివాళ్ళు కారు. చిన్నవాడు మంచోడే కానీ, అమాయకుడు. ఒకరోజు ముగ్గుర్నీ పిలిచి ‘మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి’ అన్నాడు. ముగ్గురినీ మైదానంలోకి తీసుకెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి… ‘అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి!’ అని చెప్పి కోటలోకి వెళ్ళిపోయాడు. వాటిలో ఒక ఈక తూర్పు, మరొకటి పడమరకు వెళ్లింది. దీంతో పెద్దవాళ్లిద్దరూ చెరోదిక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మూడో ఈక పైకైతే ఎగిరింది. కానీ తిరిగి అక్కడే నేలమీద పడిపోయింది. అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవాడిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే, నేలమీద ఒక తలుపు కనిపించింది. దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి. దిగి వెళితే ఒక గది. గది లోపలి నుంచి ‘నేను కష్టాలన్నీ తీరుస్తాను!’ అనే మాటలు వినిపించాయి. మూడో వాడు, ‘ఏమిటా?’ అని లోపలికి వెళ్ళి చూశాడు. ఒక పెద్దకప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద ఉంది. దాని చుట్టూ బోలెడు కప్పలు ఉన్నాయి. వెంటనే ఆ కప్పల రాజు
‘ఎవరు నువ్వు?’ అని అడిగింది. మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు. వెంటనే ఆ కప్పరాజు ‘నా మాయల పెట్టె తీసుకు రండి!’ అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకొచ్చాయి. కప్పరాజు మూత తీసి, దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది. ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి, గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు. రాజు మూడోవాడు తెచ్చిన బంగారు శాలువా చూసి ‘శభాష్!’ అన్నాడు. ఇప్పుడు రెండో పరీక్ష. ‘ఈ లోకంలోకెల్లా మంచి ఉంగరం తేవాలి!’ అంటూ మళ్లీ మూడు ఈకల్ని ఎగరేశాడు. అవి మళ్ళీ అలాగే పడ్డాయి. పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే, మూడోవాడు మళ్ళీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కప్పరాజు పెట్టెలోంచి వజ్రపుటుంగరం తీసి ఇచ్చాడు. ఈసారికూడా రాజు మూడోవాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి ‘శభాష్!’ అన్నాడు. ఇప్పుడు ఆఖరి పరీక్ష. ‘ఈ భూమిమీద అందరిలోకెల్లా అందమైన అమ్మాయిని తేవాలి!’ అంటూ మళ్ళీ ఈకలు ఎగరేశాడు. ఈసారికూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే, మూడో ఈక కిందనే పడటంతో.. మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు. అందులో తన కూతురైన ఆడకప్పను కూర్చోమన్నాడు. ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి. చేసేదిలేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి, మూడోవాడికేసి తిరిగి ‘నువు తెచ్చిన అమ్మాయి ఏది?’ అన్నాడు. ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది. అది చూసి సభలోని వాళ్లంతా నవ్వడం మొదలు
పెట్టారు. అప్పుడే పల్లకిలో కప్ప బయటకు గెంతింది. అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. రాజు మళ్ళీ ‘శభాష్!’ అని మెచ్చుకుని మూడోవాడిని రాజుగా ప్రకటించాడు. కానీ పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళుకదా? తండ్రి మీదకే కత్తులు దూసి ‘ఇక మేమే రాజులం. మీరంతా రాజ్యం విడిచి పొండి!’ అన్నారు. అప్పుడో చిత్రం జరిగింది. పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి, పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి. ఆయన పెద్దకొడుకులను దేశం నుండి తరిమేసి, మూడోవాడిని రాజును చేశాడు.
నీతి : మంచి ఆలోచనలతో
ఉన్నవారికెప్పుడూ మంచే జరుగుతుంది!