యాదాద్రి, మార్చి 25: గత 11 రోజులుగా వైభవంగా సాగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి డోలోత్సవంతో ముగిశాయి. ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. మండపంలో 108 కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.