యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి సన్నిధిలో శనివారం స్వామి వారి నిత్య పూజలు కోలాహలంగా సాగాయి. తెల్లవారుజామునే సుప్రభాతం నిర్వహించి స్వామి వారిని మేల్కొపిన అర్చకులు ఆర్జిత పూజలను ప్రారంభించా రు. ఉత్సవమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు జరిపారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిం చి, హారతి నివేదనలు అర్పించారు.
శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచి, సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరు కల్యాణమహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో నే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు.
కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు. కల్యాణ వేడుకను భక్తులు వీక్షించి తరించారు. సాయంత్రం వేళ అలంకార వెండిజోడు సేవలు నిర్వహించా రు. అనుబంధాలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు.
కొండకింద గోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. వ్రతమాచరించిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. దర్శనం అనంతరం భక్తులకు ప్రీతికరమైన స్వామివారి లడ్డూను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. కొండపైన ప్రసాద విక్రయశాల వద్ద క్యూలో నిలుచుని ప్రసాదాలను కొనుగోలు చేశారు.