పట్టణాలు, గ్రామాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మే 23 : మిషన్ భగీరథ తాగునీటి పథకంలో భాగంగా శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి నీటిని పంపింగ్ చేసే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద పంపుసెట్లకు మెయింటెనెన్స్ చేస్తున్నందున ఈనెల 29నుంచి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడునుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ వద్ద ఎంజీకేఎల్ఐ పంపుసెట్ల మెయింటెనెన్స్ పూర్తయ్యేవరకు అంతరాయం ఉంటుందన్నారు. దీంతో లిఫ్ట్ద్వారా జడ్చర్ల పందిరిగుట్ట వద్ద గల నీటిశుద్ధి కేంద్రానికి నీటి సరఫరా నిలిచి పోనున్నదని తెలిపారు. గతేడాది అధిక వర్షాల కారణంగా పంపుసెట్టు నీటమునిగిపోయిన సందర్భంగా వాటిని మరమ్మతు చేయనున్నారన్నారు. అందుచేత ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలుగకుండా జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులతో పాటు అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న తాగునీటి బోర్లు, మంచినీటి వనరులను గుర్తించి వాటి ద్వారా మంచినీటి సరఫరా ప్రారంభించాలని సూచించారు. ఈనెల 29వ తేదిలోగా ఇదివరకు గ్రామాలకు, పట్టణాలకు సరఫరా అయ్యే బోర్లను అందుబాటులోకి తీసుకోవాలని, ఒకవేళ బోర్లు కాలిపోయిఉంటే వాటికి మరమ్మతు చేయించాలని సూచించారు.