నారాయణపేట : జిల్లాలో నకిలీ విత్తనాలను, నాసిరకపు ఎరువులను నియంత్రించడానికి సీఐలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ఫర్టిలైజర్ షాపుల్లో గ్రామాల్లో ఎవరైనా దళారులు నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా, తయారు చేసినా అలాంటి వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.
రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించాలన్నారు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి మండలాల వారీగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతో నిఘా ఉంచి దాడులు నిర్వహించి నకిలీ విత్తన దందాలను అరికట్టాలని ఆదేశించారు.
నకిలీ విత్తనాలు అమ్మినట్లు రిపీటెడ్ గా కేసులు నమోదైతే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రజలకు ఎవరైనా మీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు అమ్మడం, సరఫరా చేయడం, తయారుచేయడం చేసినా వాళ్ల వివరాలు ఏమైనా మీ దృష్టికి వస్తే వెంటనే పోలీస్ వాట్సప్ నెంబర్ 7901400100 మెసేజ్ చేయాలన్నారు.
లేదా డయల్100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాక్ డౌన్ నిబంధనల మేరకు ప్రజలు తమ పనులను ముగించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.