‘తినగ తినగ వేము తియ్యనుండు’ అన్నాడు శతకకర్త. వేపను ఎలా తినాలో చెప్పలేదాయన. వేపాకు సంగతేమో కానీ, వేప పువ్వులోని చిరు చేదు ఉగాది పచ్చడి తిన్నప్పుడల్లా అనుభవంలోకి వస్తుంది. కంటికి ఇంపుగా కనిపించే వేపపువ్వు, పంటికింద నలిగినప్పుడల్లా జిహ్వ జివ్వుమంటుంది.
ఒంట్లోని వికారాన్ని దూరం చేసే దివ్యౌషధం ఇది. దాన్ని ఉగాది పచ్చడికే పరిమితం చేయకూడదు. పండుగ తర్వాత కూడా, వంటల్లో జోడించుకొని రుచితోపాటు ఆరోగ్యాన్నీ పొందవచ్చు.
వేపపువ్వు కారం
కావాల్సినవి: వేపపువ్వు : రెండు కప్పులు, ఎండుమిర్చి : ముప్పావు కప్పు, మినుపపప్పు : ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు : అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి, ఉప్పు : తగినంత
తయారీ: వేపపువ్వు, ఎండుమిర్చి, శనగపప్పు, మినుపపప్పు విడివిడిగా కడాయిలో వేయించాలి. తర్వాత వాటన్నిటినీ మిక్సీ గిన్నెలో వేయాలి. అందులోనే ఉప్పు, ధనియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కావాలంటే నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఈ వేపపువ్వు కారాన్ని వేడివేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది.
వేపపువ్వు రైస్
కావాల్సినవి: అన్నం : ఒక కప్పు, నెయ్యి : ఒక టేబుల్ స్పూన్, వేపపువ్వు: ఒకటిన్నర టేబుల్ స్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, ఉప్పు: తగినంత, పచ్చికొబ్బరి తురుము (కావాలనుకుంటేనే): పావు కప్పు, నూనె: సరిపడా, జీలకర్ర: పావు టీ స్పూన్, ఆవాలు: పావు టీ స్పూన్, మినుపపప్పు: ఒక టీ స్పూన్, శనగపప్పు: ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టీ స్పూన్
తయారీ: పాన్లో నెయ్యి వేడి చేసి, వేపపువ్వును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మినుపపప్పు, శనగపప్పు, కరివేపాకు వేయించాలి. ఆపైన అన్నం, వేప పువ్వు, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలపాలి. ఈ వేపపువ్వు అన్నాన్ని పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు.
వేపపువ్వు రసం
కావాల్సినవి :వేపపువ్వు: ఒకటిన్నర టేబుల్ స్పూన్, చింతపండు: కొద్దిగా, రసం పొడి: అర టీ స్పూన్, టమాటా తరుగు: ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము: రెండు టీ స్పూన్లు, ఉప్పు: తగినంత, నెయ్యి లేదా నూనె: సరిపడా, జీలకర్ర : పావు టీ స్పూన్, ఆవాలు: పావు టీ స్పూన్, ఇంగువ: చిటికెడు, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెమ్మ
తయారీ : ముందుగా చింతపండును ఒకటిన్నర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి, పది నిమిషాల తర్వాత రసం పిండుకోవాలి. అందులో బెల్లం తురుము, టమాటా తరుగు, ఉప్పు, రసం పొడి, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి కలపాలి. దాన్ని పావుగంటసేపు మరిగించాలి. తర్వాత నెయ్యిలో వేయించుకున్న వేపపువ్వు వేసి కలపాలి. చివరగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టి, దాన్ని రసంలో పోయాలి. అంతే నోరూరించే వేపపువ్వు రసం సిద్ధం.
ఇవీ కూడా చదవండి…