హైదరాబాద్ : షబ్-ఎ-బరాత్ను పురస్కరించుకుని ఆదివారం సాధారణ ప్రజానీకం మక్కా మసీదులోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మక్కా మసీదు సూపరింటెండెంట్ అబ్దుల్ ఖాదీర్ మాట్లాడుతూ.. మతపరమైన వేడుకల్లో సామూహిక సమావేశాలు లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులను ప్రార్థనల నిమిత్తం మసీదులోకి అనుమతించటం లేదన్నారు. కేవలం మసీదు సిబ్బంది మాత్రమే ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. నగరంలోని ఇతర ప్రదేశాల్లో నిర్వహించ తలపెట్టిన సామూహిక ప్రార్థనలను సైతం నిలిపివేసినట్లు చెప్పారు. ప్రజలు ఇంట్లోనే ఉంటూ ప్రార్థనల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.