హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి పనులకోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు రూ.32 కోట్లు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రారంభంకానున్న నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీచేశారు. క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీబీఎఫ్) కింద విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను వినియోగించే అధికారాన్ని కలెక్టర్కు ఇచ్చారు. ఈ నెల 13న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో ఒక్కో అదనపు కలెక్టర్ పరిధిలో అసంపూర్తి పనుల కోసం రూ.25 లక్షల నిధులు (మొత్తం రూ.8 కోట్లు) విడుదల చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల వద్ద రూ.40 కోట్ల్లు అందుబాటులో ఉన్నాయి.