వెల్దుర్తి, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భగీరథ ప్రయత్నం ఫలించింది. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు మండుటెండల్లో సైతం మెతుకు సీమలో అడుగిడి.. పరుగులు తీస్తుండటంతో రైతులు, ప్రజాప్రతినిధులు జల సంబురాల్లో మునిగిపోయారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి చెక్డ్యాం, ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద గోదావరి జలాలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్గౌడ్, రాష్ట్ర లేబర్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి తదితరులు పూజలు చేశారు. గోదారమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఉప్పులింగాపూర్ వద్ద నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో పచ్చని పంటలతో కళకళలాడుతున్న దని పేర్కొన్నారు. ఎక్కడి గోదావరి.. ఎక్కడి హల్దీవాగు.. గోదావరి నదే తరలివచ్చిందా అనే రీతిలో నీళ్లు పరవళ్లు తొక్కుతుంటే చాలా సంతోషంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. నీళ్ల రాకతో ఈ ప్రాంత రైతులు పండుగ జరుపుకొంటున్నారని వారు తెలిపారు.