రాష్ట్ర ప్రభుత్వానికి టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ విభాగాలను గుర్తించినట్టుగానే అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వార్తలు సేకరించి అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్ల్యూజే-హెచ్143) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, తెమ్జూ అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. దేశంలోని బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాయని తెలిపారు. ఇలా గుర్తించడం ద్వారా జర్నలిస్టులు అనారోగ్యం బారినపడ్డా, మృతి చెందినా పెద్దమొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఆ రాష్ట్రాల మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా జర్నలిస్ట్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి, కరోనా బారిన పడితే మెరుగైన వైద్యసహాయం ఉచితంగా అందించాలని, ఒకవేళ చనిపోతే బాధితుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమీకి ఇచ్చిన వెల్ఫేర్ఫండ్తో కొంతవరకు ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.