హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ (డబ్ల్యూఎఫ్పీ) బృందం ప్రశంసించింది. భారత్ నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యలను పారద్రోలటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, ఎన్జీవోలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఎఫ్పీ భారత డైరెక్టర్ బిషో పారాజులి పేర్కొన్నారు. గురువారం వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూఎఫ్పీతో కలిసి పనిచేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. పోషకాహార లోపంపై కౌమారబాలికల్లో అవగాహన కోసం ఎమ్మెల్సీ కవిత తీసుకున్న చర్యలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రత్యేకంగా కీర్తించారు. ప్రభుత్వ దవాఖానల్లో బాలింతలు, గర్భిణులతోపాటు సహాయకులకు కూడా పౌష్టికాహారాన్ని అందించటం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కవిత వివరించారు. అన్నపూర్ణ కేంద్రాలతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నదని తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకులతో వలస కూలీలకు కలుగుతున్న ప్రయోజనాలను విశదీకరించారు.
అతిపెద్ద మానవీయ సంస్థ
ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థగా డబ్ల్యూఎఫ్పీ గుర్తింపు పొందింది. ఆకలిని పారద్రోలడం, ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించటంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తున్నది. పేద దేశాలతోపాటు యుద్ధ ప్రాంతాల్లో అమూల్యమైన సేవలందిస్తున్న డబ్ల్యూఎఫ్పీ గతేడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని కైవసం చేసుకున్నది. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ తెలంగాణ ప్రభుత్వ చర్యల్ని అభినందించటం ఒక విశేషమైతే.. తమతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించటం మరో విశేషం.