సింగరేణి సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో కార్మికుల భద్రత, వైద్యసేవలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని సీఎండీ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఒక కుటుంబం వంటిందని, కుటుంబసభ్యుల రక్షణ కోసం వచ్చిన అన్నిసూచనలను వీలైనంత త్వరగా అమలుచేస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్లోని సింగరేణిభవన్లో సోమవారం 47వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం కార్మికుంలందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేశామని తెలిపారు. గనుల్లో కార్మికుల సౌకర్యం కోసం 56 మ్యాన్రైడింగ్ ఏర్పాటుచేశామని, అత్యాధునిక సిమ్యులేషటర్లతో ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నామని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్సేఫ్టీ మలయ్ టికేదార్ మాట్లాడుతూ.. భద్రత కోసం తాము చేసిన సూచనలను సంస్థ వెంటనే అమలుచేస్తున్నదని, ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడానికి పటిష్టచర్యలు, సమీక్షలు నిర్వహించాలని సూచించారు. యూనియన్ నాయకులు, డీజీఎంఎస్ అధికారులు చేసిన సూచనలను స్వాగతించిన సీఎండీ శ్రీధర్.. వాటిపై మరో వారంలోగా డైరెక్టర్లు, జీఎంలతో సమావేశమై చర్చిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బీ వెంకట్రావ్, జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి డైరెక్టర్లు, డీజీఎంఎస్ డైరెక్టర్లు, జీఎంలు, సేఫ్టీ జీఎంలు పాల్గొన్నారు.