హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇంచార్జిలుగా వ్యవహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పార్టీకోసం అహోరాత్రులు కష్టపడ్డారని ఆదివారం ఆయ న ప్రశంసించారు. పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కేటీఆర్ చెప్పారు. తమ విజ్ఞప్తిని గౌరవించి భారీగా ఓట్లువేసిన విద్యావంతులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బొమ్మమీదనే గెలువబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో భారీగా పోలింగ్ నమోదైందని, రెండుస్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని చెప్పారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావటానికి కృషిచేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి భయంతో చివరి నిమిషంలో సానుభూతి కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేసిందని విమర్శించారు.
జనసైనికులను అవమానిస్తున్న బీజేపీ
గౌరవం లేనిచోట స్నేహం చేయదలుచుకోలేదని తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీ నేతలు జనసేనను పట్టించుకోవడం లేదని, జనసైనికులను అవమానపరుస్తున్నారని చెప్పారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు తెలిపినట్టు పేర్కొన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కార్యాలయంలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ నిర్మాణం చురుగ్గా జరుగుతున్నదని తెలిపారు. జనసైనికుల మనోభావాలను దెబ్బతీయొద్దని బీజేపీ నేతలకు సూచించారు.