హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : అది కరోనా విలయతాండవం చేస్తున్న సమ యం.. ప్రజలను కాపాడుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా శ్రమిస్తున్న వేళ.. ఒక్కసారిగా కరోనా నుంచి కోలుకున్న రోగులపై బ్లాక్ఫంగస్ దాడి చేసింది. దాని తీవ్రతను పసిగట్టిన ప్రభుత్వం రంగంలోకి దిగింది. మే రెండోవారంలో రాష్ట్రంలో ఈ కేసులు బయటపడ్డాయి. అప్పటికి ఈ బూజురోగం ఎందుకు సోకుతున్నది? చికిత్స ఎలా? అన్న ప్రశ్నలకు దేశంలో సమాధానం లేనేలేదు. దీన్ని చాలెంజ్గా తీసుకొన్న సీఎం కేసీఆర్ కోఠి ఈఎన్టీ ప్రభుత్వ దవాఖానను బ్లాక్ఫంగస్ నోడల్ కేం ద్రంగా ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్రం తీసుకొన్న నిర్ణయమిది. మే 19న నోటిఫైబుల్ డిసీజ్గా బ్లాక్ఫంగస్ను కేంద్రం గుర్తించింది. అప్పటికే కోఠి ఈఎన్టీ వైద్యులు చికిత్స మొదలుపెట్టేశారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సం పత్ మే 12న తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దవాఖానలో 125 ఉన్న పడకలను 300కు పెంచి, వైద్య పరికరాలు, సిబ్బందిని యుద్ధప్రాతిపదికన సమకూర్చింది. లైఫోసోమల్ ఆంఫోటెర్సిన్, ఆంఫోటెర్సిన్-బీ, పోసకొనజోల్ వంటి ఖరీదైన మందుల కొరత లేకుండా చూసుకొన్నది. మొత్తం ఇప్పటిదాకా 519 సర్జరీలు చేసిన ఈఎన్టీ వైద్యులు ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. మొత్తంగా ఒక్కో పేషెంట్పై ప్రభుత్వం రూ.2.04 లక్షలు ఖర్చు చేసింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహ కారంతో పేషెంట్లు, సహాయకులకు మూడుపూటలా రోజూ 600మందికి భోజ నం ఏర్పాటుచేశా రు. ఇందుకు సీఎస్ సోమేశ్కుమార్ చొరవ తీసు కున్నారు. నెగెటివ్ ఉన్నవాళ్లకు కోఠి ఈఎన్టీలో, పాజిటివ్ ఉన్నవాళ్లకు గాంధీలో చికిత్సచేశారు. సరోజినీదేవి, టిమ్స్, ఏరియా దవాఖానలు, రిమ్స్, ని జామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, సూ ర్యాపేట, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి దవాఖానల్లో 1500పైగా బ్లాక్ఫంగస్ పడకలను అందుబాటులోకి తెచ్చి వైద్యం అందజేసింది.
కోఠి ఈఎన్టీ దవాఖాన (నాన్ కొవిడ్)
మొత్తం అడ్మిషన్లు 893
సర్జరీలు 519
ఇన్ పేషెంట్లు 181
పెండింగ్ సర్జరీలు 81
మరణాలు 0
గాంధీ దవాఖాన (కొవిడ్)
సర్జరీలు 335
మరణాలు 40
అర్ధరాత్రి సైతం సర్జరీలు చేశాం
వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది ఇలా అందరం కలిసి బ్లాక్ ఫంగస్పై పోరాటం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రభుత్వం వైద్య పరికరాలు, ఔషధాల కొరత రాకుండా చూసింది. ఒకరోజు ఉదయం 8 నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సర్జరీలు చేశాం. అలా గరిష్ఠంగా ఒక్క రోజే 40 సర్జరీలు చేశాం.
– డాక్టర్ తాటి శంకర్, కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్