జైపూర్ : క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు. జైపూర్ లో జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పురుషుల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ హక్కుల దక్కించుకున్న ‘ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థనే మహిళల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా నిర్వహించనుందని జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.
కొవిడ్ మహమ్మారి వల్ల జనవరిలో వాయిదాపడ్డ పురుషుల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని వచ్చే రెండు నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అది ముగియగానే మహిళల హ్యాండ్ బాల్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ లీగ్స్ తో దేశంలో హ్యాండ్ బాల్ కు క్రేజ్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హెచ్ఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ఈశ్వర్ పాండే, ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చైర్మన్ అజయ్ దత్త తదితరులు పాల్గొన్నారు.