కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికే సినిమా వచ్చి నెల అయ్యుండేది కూడా. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరో 15 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ఇప్పటికే విడుదలైన లాహే లాహే పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. 50 మిలియన్ వ్యూస్ కూడా అందుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు.
ఈ పాటతో పాటు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగా జరుగుతుంది. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో ఆచార్య ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుండటంతో విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. దేశంలో రోజుకు 1.50 లక్షల వరకు కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. దాంతో అంతా కుదురుకున్న తర్వాతే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఏపీ, తెలంగాణలో లాక్ డౌన్ కూడా ఉండటంతో థియేటర్స్ కూడా మూత పడ్డాయి. తెరిచిన తర్వాత కూడా ప్రేక్షకులు మునపటిలా రావాలంటే కాస్త టైమ్ పడుతుంది.
దాంతో ఆచార్య సినిమాను నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఇలాంటి సమయంలో విడుదల చేసి పాడు చేయడం దర్శక నిర్మాతలకు ఇష్టం లేదని.. అందుకే పరిస్థితులు కాస్త చక్కబడిన తరువాత ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆచార్య సినిమా దసరా బరిలో ఉంది. అప్పటి సెలవులను క్యాష్ చేసుకోడానికి వస్తున్నాడు మెగాస్టార్. రెండేళ్ళ కింద సైరా సినిమాను కూడా దసరా బరిలోనే దించాడు. మరోసారి అదే చేయబోతున్నాడు చిరంజీవి. ఏదేమైనా ఆచార్య అప్ డేట్స్ కోసం మెగాభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.