బీబీపేట్/లింగంపేట/నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ/ నిజాంసాగర్/విద్యానగర్/ దోమకొండ/ గాంధారి, మే 17: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా పటిష్టంగా కొనసాగుతున్నది. వివిధ మండలాలు, గ్రామాల్లో వ్యాపారులు దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకే తెరిచి ఉంచారు. ఆ సమయంలోనే ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. ఉదయం 10 నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 గంటల అనంతరం రోడ్లపైకి ప్రజలు రాకపోవడంతో ప్రధాన రోడ్లన్నీ బోసి పోయాయి.
బీబీపేట్ మండలంలో లాక్డౌన్ సోమవారం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటల తర్వాత ఏఎస్సై రాములు సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లింగంపేటలో పకడ్బందీగా కొనసాగింది. లాక్డౌన్ కారణంగా ఆరో రోజైన సోమవారం సైతం మండల కేంద్రం జన సంచారం లేక వెలవెలబోయింది. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచారు. ఉదయం వేళ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూరగాయలు విక్రయించడానికి మండలకేంద్రానికి తరలివచ్చారు. మండలకేంద్రంలో ప్రజలు బయట తిరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు.నాగిరెడ్డిపేట్ మండలంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం నిర్వహించే సంత రద్దు కావడంతో గోపాల్పేట్ బోసిపోయింది.
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాలతోపాటు డెయిలీ కూరగాయల మార్కెట్, కిరాణా మార్కెట్ ఉదయం వేళలో కిటకిటలాడాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా సీఐ రాజశేఖర్, ఎస్సై శ్వేత చర్యలు చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, గాంధీచౌక్, నిజాంసాగర్ రోడ్లో పోలీసులు బందోబస్తు నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు.
బాన్సువాడలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నదని ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నామని తెలిపారు.
నిజాంసాగర్ మండలంలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. పోలీసులు ప్రధానకూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. మహ్మద్నగర్లో బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.
జిల్లాకేంద్రంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలను మూసి వేయించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను ఆపి ప్రశ్నించారు. సరైన ఆధారాలు చూపని వారి వాహనాలను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు.దోమకొండ మండలకేంద్రంలో లాక్డౌన్ను ఎస్సై రాజేశ్వర్గౌడ్, ఏఎస్సై ఉమేశ్ పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలను మూసి వేయాలని వ్యాపారులకు సూచించారు.గాంధారిలో లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు దుకాణాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. మెడికల్ షాపులు, ప్రైవేటు దవాఖానలు మాత్రమే తెరిచి ఉంచారు. ఉదయం పది గంటల తర్వాత కొనసాగుతున్న దుకాణాలను పోలీసులు మూసివేయించారు. లాక్డౌన్కు సహకరించాలని ఎస్సై శంకర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.