హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆ బృందం ప్రశంసించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఆ ఎంపీల బృందం హైదరాబాద్లో పర్యటించింది. తాజ్ కృష్ణలో మహిళా కమిషన్తో మహిళా ఎంపీల బృందం భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. అమీర్పేటలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ దివ్య దేవరాజన్ వివరించారు. గర్భిణీ మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్ గురించి ప్రత్యేకంగా వివరించారు.
కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్ వివరాలను ఆ ఎంపీల బృందం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే గొప్ప కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. న్యూట్రీ గార్డెన్ వలన పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది అంటూ ప్రశంసించారు. ఇలాంటి న్యూట్రీ గార్డెన్ దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక్క దిక్సూచి అంటూ ఎంపీల బృందం కొనియాడారు.