వ్యక్తిపై పెట్రోల్పోసి సజీవ దహనానికి యత్నం
హనుమకొండలో చిట్టీ ఏజెంట్ భార్య ఘాతుకం
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: చిట్టీ డబ్బులు ఇవ్వాలని కోరిన వ్యక్తిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన శుక్రవారం హనుమకొండలో కలకలం రేపింది. బాధితుడు, పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ కాంగ్రెస్ భవన్ ఎదుట కొన్నేళ్లుగా పిట్టల రాజు శ్రీసెల్ వరల్డ్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. హనుమకొండలోని అచల చిట్ఫండ్లో రాజు రూ.5 లక్షల చిట్టీ వేస్తున్నాడు. ఏజెంట్ గొడుగు గణేశ్కు డబ్బులు కట్టేవాడు. మధ్యలో చిట్టీ ఆపిన రాజు తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. నెలల తరబడి చిట్ఫండ్ యాజమాన్యం, ఏజెంట్ గణేశ్ డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారు. దీంతో శుక్రవారం నక్కలగుట్టలోని చిట్ఫండ్ బ్రాంచికి వెళ్లి ఆందోళన చేశాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఏజెంట్ గణేశ్ తన భార్య కావ్య ద్వారా రాజును సజీవదహనం చేయించేందుకు వ్యూహం రచించాడు. పథకంలో భాగంగా సాయంత్రం 4 ప్రాంతంలో షాపులోకి వచ్చిన కావ్య.. ఒక్కసారిగా బ్యాగులో నుంచి పెట్రోల్ బాటిల్ తీసి రాజుపై పోసి నిప్పంటించింది. అక్కడి నుంచి పరారైంది. మంటలతోనే కేకలు వేస్తూ రాజు బయటకు పరుగులు తీశాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న పాన్షాపు యజమాని రంగయ్య కూడా గాయాలపాలయ్యాడు. స్థానికులు నీళ్లుపోసి మంటలను ఆర్పివేసి దవాఖానకు తరలించారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్తో అక్కడికి చేరుకుని దుకాణంలో మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ సీఐ వేణుమాధవ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.