కరీంనగర్ : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నాగులమాల్యాలకు చెందిన నిఖిత అనే గర్బిణికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో స్థానిక యశోద కృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు. మహిళ శనివారం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడ శిశువులుగా మరో ఇద్దరు మగ శిశువులు. తల్లీ, పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా శిశువులు తక్కువ బరువుతో జన్మించడంతో ఇంక్యుబేటర్లలో ఉంచారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడంతో నిఖిత ఆమె భర్త సాయికిరణ్ గౌడ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు మరో ఆసక్తికర విషయం ఎంటంటే నిఖిత కవల సోదరి లిఖిత సైతం నాలుగు నెలల క్రితం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.