ఢిల్లీ,మే 2: ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ అవసరమని ఎయిమ్స్ చీఫ్ డా.రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయని.. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లతో పెద్దగా ఉపయోగం లేదని.. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్డౌన్ అవసరమన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నా అవి అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందని..ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది మరణించడం, అందులో ఓ వైద్యుడు ఉండటం అత్యంత బాధాకరమని గులేరియా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆ వైద్యుడు తనకు తెలుసన్నారు.
ఆసుపత్రుల్లో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని.. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని ఆయన హెచ్చరించారు. ‘ఆసుపత్రుల్లో రోగులు పెరిగిపోతుండటంతో వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదు. కేసులను తగ్గించేందుకు కఠిన లాక్డౌన్ విధించడం లేదా ఇంకేదైనా మార్గముంటే అమల్లోకి తీసుకురావాలి’ అని సూచించారు.