హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు తెలంగాణ తొలి అడుగు వేసింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులపై సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ సందర్భంగా కేంద్రానికి ఇచ్చిన హామీని తెలంగాణ నిలబెట్టుకొన్నట్టు అయింది. ఇక తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాల్సి ఉన్నది.
అపెక్స్ కౌన్సిల్లో హామీ కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంత వాదనలను బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ వినాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని వాటానీటిని కొత్త ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని పలుమార్లు లేఖలు రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ ఇదే వాదనను వినిపించారు. గతేడాది అక్టోబర్లో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ సమావేశంలో జల వివాదాల పరిష్కారాన్ని ట్రిబ్యునల్కు బదలాయించాలని సీఎం కేసీఆర్ మరోసారి కోరారు. అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని పేర్కొన్న కేంద్రమంత్రి.. పిటిషన్ను ఉపసంహరించుకుంటే వివాదాలను ప్రస్తుత ట్రిబ్యునల్కు అప్పగించడం లేదా కొత్త ట్రిబ్యునల్కు బదలాయించి పరిష్కరించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో తాము పిటిషన్ను ఉపసంహరించుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ హామీ మేరకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ దాఖలుచేసింది.
కేంద్రానికి ఇచ్చిన హామీమేరకు సుప్రీంకోర్టు నుంచి రిట్పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇక ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్రం జలవివాదాలను పరిష్కరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ తరఫున కేంద్రానికి లేఖ రాయనున్నట్టు వివరించారు. రెండుమూడ్రోజుల్లో పిటిషన్ నంబర్ వస్తుందని, నెలాఖరునాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.