హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వైన్షాపుల లైసెన్స్ గడువు మరో నెలపాటు పొడిగించారు. ఏ-4 దుకాణాల (వైన్ షాప్ల) లైసెన్స్ గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది. నవంబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావాల్సి ఉంది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, నూతన మద్యం పాలసీపై కసరత్తు కొనసాగుతుండడంతో ప్రస్తుతం ఉన్న దుకాణదారులకే మరో నెలపాటు గడువు ఇచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుత మద్యం దుకాణదారులను ప్రోత్సహించేలా ఇప్పటికే 10 సార్లు సరుకు తీసుకున్నవారి మార్జిన్ను 6.4 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ ఒకటి తర్వాత పదిసార్లు కోటాను దాటినవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనున్నది. అదేవిధంగా బార్లకు లైసెన్స్ఫీజులో ఒకనెల మొత్తాన్ని రిబేట్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం బార్ లైసెన్స్ ఫీజును 12 భాగాలుగా చేసి, అందులో ఒక నెల మొత్తాన్ని రిబేట్గా ఇస్తారు. ఈ మొత్తాన్ని ఒక్కో నెలలో కొద్దిమొత్తం చొప్పున మినహాయిస్తారు.