తెలియకుండానే కాంట్రవర్సీలో ఇరుక్కుపోతున్నాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. దాదాపు 30 మంది కలిసి చేసిన స్కిట్ లో ఈయన మాత్రమే హైలైట్ అయ్యాడు. ఇప్పుడు ఈయన చుట్టూనే ఉచ్చు బిగుసుకుంటుంది. తెలంగాణ భాష యాసను అవమానించాడంటూ ఈయనపై ఫైర్ అవుతున్నారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. ఈయన కామెడీ మాత్రమే కాదు కాంట్రవర్సీలు కూడా చాలానే చేస్తుంటాడు. ఈయన స్కిట్స్ చూస్తే ఎంత నవ్వొస్తుందో.. అందులో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈయన స్క్రిప్ట్ రాయకపోయినా కూడా స్కిట్ చేసినందుకు అడ్డంగా బుక్ అయ్యాడు. ఓ భాష, ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకున్నాడంటూ ఈయనపై పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
దానికి కారణం ఈయన తెలంగాణ బాష, యాసను అవమానిస్తూ ఈయన మాట్లాడటమే. హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల కింద ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో తెలంగాణ ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మతో పాటు గౌరమ్మను, తెలంగాణ భాష యాసని అవమానపరిచేలా మాట్లాడాడంటూ ఈయనపై కేసు ఫైల్ చేసారు. తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా హైపర్ ఆది స్కిట్తో పాటు స్క్రిప్ట్ కూడా ఉందంటూ వాళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేసారు. అంతేకాదు స్క్రిప్ట్ రాసిన రైటర్.. నిర్మించిన మల్లెమాల ప్రొడక్షన్పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు. అయితే తనపై పెట్టిన కేసుపై హైపర్ ఆది కూడా రియాక్ట్ అయ్యాడు. తన తప్పు ఉంటే కచ్చితంగా సారీ చెప్తానంటూ తెలిపాడు.
అయితే ఆ రోజు జరిగిన స్కిట్ తనది కాదని.. స్క్రిప్ట్ తాను రాయలేదని చెప్పుకొచ్చాడు. ఎవరో స్క్రిప్ట్ రాస్తే.. తాను ప్రాక్టీస్ కూడా చేయకుండా వచ్చి నేరుగా పర్ఫార్మ్ చేసానని చెప్పాడు. అయినా తెలంగాణ భాష అన్నా.. యాస అన్నా తనకు గౌరవం అని చెప్పుకొచ్చాడు. ఆ రోజు స్టేజీపై తనతో పాటు 30 మంది కమెడియన్లు ఉన్నారని.. అందులో ఎవరు గౌరమ్మ అన్నారో.. ఎవరు బతుకమ్మ అన్నారో తనకు తెలియదంటూ ఫోన్ కట్ చేసాడు ఈయన. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతుంది. హైదరాబాద్ వీధుల్లో నువ్వెలా తిరుగుతావో మేం కూడా చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. మరి ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి.