హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఏపీలో అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎలాంటి అనుమతుల్లేని ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కారు దూకుడును నిలువరించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కృష్ణా బేసిన్లోని పలు ప్రాజెక్టులపై తెలంగాణ సాగునీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో జలసౌధలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని తెలంగాణ ఇప్పటికే వివిధ వేదికలపై ప్రశ్నిస్తున్నది. తాజాగా సుప్రీం కోర్టులో సవాలుచేయాలని తీర్మానించింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు రజత్కుమార్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.