హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పి.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్.
అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకెళ్తుంది..
అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించామని తెలిపారు. ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. అభివృద్ధికి నిదర్శనం తెలంగాణ, తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు.
ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నాం..
ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ర్టం ముందుకెళ్తుందన్నారు. రాష్ర్టం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాదికి రాష్ర్ట తలసరి ఆదాయం రూ. 2 లక్షల 28 వేలకు పెరిగిందన్నారు. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పారు.
కొవిడ్ వల్ల అనేక రాష్ర్టాలు ఇబ్బంది పడ్డాయి, మేం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
విద్యుత్ రంగంలో అద్వితీయ విజయాలు
విద్యుత్ రంగంలో రాష్ర్టం అద్వితీయ విజయాలు సాధించిందని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ అందించే తొలి రాష్ర్టంగా రికార్డు సాధించామన్నారు. ఇండ్లు, దుకాణాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. జాతీయ సగటు కంటే రాష్ర్ట విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ అని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణలపై కేంద్రం రాష్ర్టాన్ని ప్రశంసించింది.
తాగునీటి గోసను తీర్చిన మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. దశాబ్దాల తాగునీటి గోసను మిషన్ భగీరథ తీర్చిందన్నారు. ప్రతి మారుమూల తండా, గూడెం వరకు భగీరథ జలాలను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయతో పెరిగిన భూగర్భ జలాలు
మిషన్ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం. ఈ పథకం ద్వారా సుమారు 30 వేల చెరువులను బాగు చేశామన్నారు. మేం చేపట్టిన అనేక చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కొత్త రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమైక్యాంధ్రలో రాష్ర్ట ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం. కరువు ప్రాంతాలకు సాగునీరు అందివ్వడంతో పాలమూరులో వలసలు ఆగిపోయాయని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు కళకళలాడుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో బీడువారిన భూములకు సాగునీరు అందించామన్నారు.
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. రుణాల కింద వ్యవసాయ పరికరాలను అందించి రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. 2.10 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయన్నారు. 2020-21 ఏడాదిలో 1.04 కోట్ల ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగు చేశారన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. పత్తి సాగులో కూడా తెలంగాణ అద్భుతమైన రికార్డును సృష్టించింది. పత్తి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. గోడౌన్లను కూడా పెంచామన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, అద్భుతాలు సృష్టిస్తున్నామని తెలిపారు.
ఆసరా పెన్షన్లు అందించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. తండాలను, గూడెలను కూడా గ్రామపంచాయతీలను తీర్చిదిద్దిన ఘనత మా ప్రభుత్వానిది అని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, గ్రామాల అభివృద్ధికి నిధులు ఆపకుండా విడుదల చేశామన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్యార్డు, రైతువేదిక, స్మశానవాటిక, హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.