హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరుణుడు కరుణిస్తున్నాడు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 51శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఈ వానకాలం సీజన్లో మొత్తం 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 50 శాతానికిపైగా 73.53 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ పేర్కొన్నది. గత వానకాలం ఇదే సమయానికి 65.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గ్రేటర్ హైదరాబాద్తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా జడివాన కురిసింది. హైదరాబాద్ పరిధిలోని హయత్నగర్ సర్కిల్ బండ్లగూడలో అత్యధికంగా 21.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో 20, ఎల్బీనగర్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడురోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జడివాన కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు అలుగులు పోశాయి. పలుచోట్ల వర్షపునీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వాగులో రైతు కండెల కాశన్న (60) గల్లంతయ్యాడు. వ్యవసాయపనుల కోసం వెళ్లి సాతారం వాగులో చిక్కుకున్న ఏడుగురిని, కోరుట్ల పట్టణ పరిధిలోని ఎకీన్పూర్ వాగులో చిక్కుకున్న ముగ్గురిని అధికారులు సురక్షితంగా కాపాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాను వర్షం ముంచెత్తింది. నల్లవాగు ప్రాజెక్టుతోపాటు, పలు చెక్డ్యాంలు పొంగి పొర్లుతుండగా, సింగూరులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. జిల్లాలో 27 చెరువులు అలుగు పారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని బునాదిగాని కాలువకు మూడుచోట్ల గండిపడటంతో పంట పొలాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. వలిగొండ- తుమ్మలగూడెం గ్రామాల మధ్య రోడ్డుపై వరద పోటెత్తడంతో భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో పంట సాగు జోరందుకున్నది. ప్రధాన పంటల సాగు ఊపందుకున్నది. పత్తి, వరి, కంది పంటలు భారీ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. పత్తి అంచనాలకు తగ్గట్టుగానే సాగవుతున్నది. మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఈ సీజన్లో పత్తిని 70లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 46.39 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. గతేడాది కూడా ఇదేస్థాయిలో 46.23 లక్షల ఎకరాల్లో సాగైంది. వరిసాగు కూడా జోరుగా సాగుతున్నది. గతేడాది ఈ సమయానికి 4.16 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయగా.. ఈసారి 8.62 లక్షల ఎకరాల్లో పూర్తయ్యాయి. మరో ప్రధాన పంట కంది 7.70 లక్షల ఎకరాల్లో సాగుకాగా.. పెసర పంటను 1.13 లక్షల ఎకరాల్లో వేశారు. కాగా, మార్కెట్లో పెద్దగా డిమాండ్లేని మక్కలను సాగు చేయొద్దంటూ ప్రభుత్వం ఎంతగా చెప్తున్నా.. రైతుల్లో మాత్రం ఆ పంటపై మక్కువ తగ్గడం లేదు. ఈ సీజన్లో ఇప్పటికే ఏకంగా 4.68 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు.