న్యూఢిల్లీ, మార్చి 27: వాహనాల ధరలను పెంచబోతున్న ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం), ఫోర్డ్ ఇండియా కూడా చేరాయి. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఈ రెండు సంస్థలు శనివారం ప్రకటించాయి. ముడి సరుకు ధరల పెరుగుదల వల్ల తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఈ చర్య చేపట్టనున్నట్లు వెల్లడించాయి. ఫోర్డ్ వాహనాల ధరలను 3 శాతం మేరకు పెంచబోతున్నామని, వాహన రకాలను బట్టి ధర పెంపులో తేడా ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. అయితే టయోటా మాత్రం తన వాహన ధరలను ఎంత మేరకు పెంచబోతున్నదీ వెల్లడించలేదు.