మనాలి : హిమాచల్ప్రదేశ్ కులు జిల్లాలోని గార్సా లోయలోని పంచనాలా సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) సొరంగం నిర్మిస్తుండగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. యంత్రాలు, కార్మికుల సహాయంతో శిథిలాలను తొలగించినట్లు తెలిపారు. శిథిలాల కింద పడి నలుగురు మృతి చెందగా.. ప్రాణాలతో బయటపడిన ఒకరిని కులులోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
పంచ నాలా వద్ద ఎన్హెచ్పీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిందని, ఆరుగురు కూలీలు లోపల చిక్కుకున్నారని తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే పోలీసులు, అంబులెన్స్లతో వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని కులు సూపరింటెండెంట్ గౌరవ్ సింగ్ పేర్కొన్నారు. శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీయగా.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 600 మీటర్ల పొడవైన ప్రాజెక్టు సొరంగంలో కార్మికులు డ్రిల్లింగ్ పనులు చేస్తున్న సమయంలో సాయంత్రం 5.40 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
డ్రిల్లింగ్ జరిగిన ప్రాంతం మొత్తం కూలిపోయిందని తెలిపాయి. కులు జిల్లాలో ఎన్హెచ్పీసీ అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినప్పటికీ, మరికొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 800 మెగావాట్ల ప్రతిపాదిత విద్యుత్ ఉత్పత్తితో ఈ ప్రాంతంలో పర్బాటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ స్టేజ్ -2ను కూడా నిర్మిస్తోంది. ఈ మెగా హైడెల్ ప్రాజెక్టు పనులు చాలా రోజులుగా నడుస్తున్నాయి. పుల్గా గ్రామం నుంచి పార్వతి నది నుంచి నీటిని సేకరించడానికి 31.52 కిలోమీటర్ల పొడవైన హెడ్ రేస్ టన్నెల్ తవ్వడం, పవర్ హౌస్ సైంజ్ సమీపంలోని సియుండ్ వద్ద నిర్మిస్తోంది. ఇది దేశంలోనే అతిపొడవైన హెడ్రేస్ సొరంగంగా అధికారులు పేర్కొన్నారు.