ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 21: కేంద్రంలో ఏడేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని?, వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేట, గడ్డివానిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పల్లా మాట్లాడారు. బీజేపీవి పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలని, ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ, ఉద్యోగాలను ఊడగొడుతున్నదని మండిపడ్డారు. ఇప్పుడు దొడ్డు వడ్లు కొనబోమని చెబుతుందని, ఫలితంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో ఆదుకుంటున్నదని చెప్పారు. ఈ ప్రాంతం ఇన్నాళ్లు అభివృద్ధిలో వెనుకబడిందని, దానికి కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలని కోరారు. నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు పథకం మంజూరవుతుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని పల్లా సూచించారు