ఇల్లందకుంట, సెప్టెంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప.. పనులు చేయడం చేతకాదని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్లో ధర్మానికి, అధర్మానికి మధ్య ఉప ఎన్నిక జరుగుతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసిందో.. ఏం చేయబోతున్నదో చెబుతున్నదని, అదే హుజూరాబాద్లో గెలిస్తే బీజేపీ నాయకులు ఏం చేస్తారో ముందుగానే చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడని, ఓట్లు వేస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్పాలన్నారు. నాలుగేళ్ల కింద సీఎం కేసీఆర్ నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఈటల ఒక్కటి కూడా కట్టించలేకపోయాడన్నారు. పదవిలో ఉండగానే పనులు చేయలేని వ్యక్తి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతోనే గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.