హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు తయారవుతుంటే కేంద్రం పది రోజుల్లో 21,500 ఇంజెక్షన్లు మాత్రమే రాష్ర్టానికి ఇవ్వడం ఏమిటి? రెమిడెసివర్ ఇంజెక్షన్పై కేంద్ర నియంత్రణ ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏం కావాలి? ఆ ఇంజెక్షన్ను ఏ ప్రాతిపదికన రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు? కరోనా చిక్సితకు వినియోగించే మందుల పంపిణీలో రాష్ర్టాల మధ్య వ్యత్యాసం ఎందుకో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ మందుల సరఫరా కోసం నోడల్ అధికారిని శనివారం మధ్యాహ్నంలోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని, కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతంలో దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. రెమిడెసివర్ ఇంజెక్షనను కేసుల ప్రాతిపదికగా సరఫరా చేస్తున్నారా లేక జనాభా ప్రాతిపదికనా లేదా రాష్ర్టాలవారీగా సరఫరా చేస్తున్నారో కేంద్రం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
నిర్ధారణ పరీక్షలు పెంచాలి
రాష్ట్రంలో రోజుకు 30 వేల నుంచి 40 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నప్పుడు దానికి అనుగుణంగా పరీక్షలను పెంచాలని ధర్మాసనం సూచించింది. హోం క్వారంటైన్ సౌకర్యాలు లేని వాళ్లకు జిల్లాల్లో 4,711 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని, దీని గురించి ప్రభుత్వం బాగా ప్రచారం చేయాలని సూచించింది. లాక్డౌన్ విధించే ప్రతిపాదన రాష్ట్రం వద్ద లేదని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని వలస కూలీలకు తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.