జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మంగళవారం జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలో పర్యటించారు. జగిత్యాల రూరల్ మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో పల్లెనిద్ర చేసిన మంత్రి ఉదయం కల్లెడ నుండి లక్ష్మిపూర్ వయా గుటరాజ్పల్లి వరకు రూ.2.72 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు, రూ.4 కోట్లతో నిర్మించే బ్రిడ్జీ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. అనంతరం కల్లెడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కరోనా విపత్కర సమయంలో సైతం సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపలేదన్నారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాల వారికి సైతం ఆసరా వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ అందించి ఇంటింటికి ప్రతిరోజు వెళ్లి చెత్త సేకరణ జరుగుతుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విష జ్వరాలు, అనారోగ్యాల బారిన పడకండా చేసిన రాష్టం కేవలం తెలంగాణ మాత్రమే అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పేర్కోన్నారని మంత్రి తెలిపారు. గ్రామాలో సేకరించిన చెత్త ద్వారా ఎరువులను తయారు చేయాలన్నారు.
కల్లెడ గ్రామంలోని పాఠశాలను అభివృద్ది చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాలో ఖాళీ స్థలంలో ఉన్న చెత్త క్లీన్ చేసే విధంగా యాజమానులకు నోటిసులు జారీచేయాలని స్పందించని వారి భూములను గ్రామపంచాయతి స్వాధీనం చేసుకొనుటకు మంత్రి ఆదేశించారు. ప్రతి ఊరి అభివృద్ధికి దాతల ద్వారా పలు కార్యక్రమలు నిర్వహించాలని మంత్రి సూచించారు. వారంలోగా వంగిపోయిన, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు సవరించాలని ఆదేశించారు. అనంతరం 118 మహిళా గ్రూపుల వారికి స్త్రీ నిధి రుణాల కింద మంజూరు చేసిన రూ. 5.8 కోట్ల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. రవి మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీరోడ్లలో పద్దతి క్రమంలో పెద్ద మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్లో నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. 42 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా 7వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్రామాలకు ఆర్థికంగా సైతం ప్రయోజనం ఉండే విధంగా బయో మొక్కలు పెంచుతున్నామని, అధికంగా వెదురు మొక్కలు పెంచున్నామని కలెక్టర్ వివరించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ కుమార్ మాట్లాడుతూ.. నీటివనరులు పెరగడం వల్ల చేపల పెంపకం ద్వారా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. పంచాయతీరాజ్శాఖ కింద జగిత్యాల జిల్లా గ్రామాలో రోడ్లు బాగుచేసుకునేందుకు, మట్టి రోడ్లు లేకుండా చేసే దిశగా రూ.50 కోట్లు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. భూపాతిపూర్ గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, గ్రామ సర్పంచ్ మహేశ్వర్రావు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.