గాంధారి/లింగంపేట/బీబీపేట్/విద్యానగర్/నాగిరెడ్డిపేట్, మే 25: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు, అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి జరిమానా విధించారు.
గాంధారి మండలకేంద్రంలో తహసీల్దార్ సంగమేశ్వర్, ఎస్సై శంకర్ లాక్డౌన్ను మంగళవారం పర్యవేక్షించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారి వాహనాలను జప్తు చేశారు. లాక్డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో లాక్డౌన్ మంగళవారం కొనసాగింది. వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి ప్రజలు రాకపోవడంతో మండలకేంద్రం బోసిపోయింది.
లింగంపేటలో మంగళవారం లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ సడలింపు సమయాల్లో వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. ఉదయం 10 గంటల అనంతరం దుకాణాలు తెరిచి ఉంచితే పోలీసులు జరిమానా విధిస్తుండడంతో వ్యాపారులు సకాలంలో దుకాణాలను మూసివేశారు. లాక్డౌన్ను స్థానిక తహసీల్దార్ అమీన్ పర్యవేక్షించారు. గ్రామాల నుంచి ప్రజలు మండలకేంద్రానికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
బీబీపేట్ మండలంలో లాక్డౌన్ కొనసాగింది. మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు.
కామారెడ్డి పట్టణంలో పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 10 గంటల అనంతరం ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పలు చోట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
నాలుగు దుకాణాలకు జరిమానా..
తాడ్వాయి, మే 25 : తాడ్వాయి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో లాక్డౌన్ సమయంలో తెరిచి ఉంచిన నాలుగు షాపులకు అధికారులు జరిమానా విధించారు. తాడ్వాయిలో ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరుగుతున్న ఐదుగురు వాహనదారులకు జరిమానా వేశామని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.