ఒక ఊరిలో ఐదారుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటమే మహా గొప్ప. అలాంటిది ఒక్క తండా నుంచే 100 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే! మరో 50 మంది ప్రైవేట్ సంస్థల్లో
ఉన్నత స్థానాల్లో పనిచేస్తుంటే! ఇదీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లా తండా ట్రాక్ రికార్డు. ఈ గ్రామంలో ప్రతి రెండిండ్లకు ఒక ఉద్యోగి ఉన్నాడు. అందులో సైంటిస్టులు ఉన్నారు, ఇంజినీర్లు, డాక్టర్లు, పోలీసులు ఉన్నారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నవాళ్లున్నారు. ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లున్నారు. అంతేనా.. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్న మెరికలు ఉన్నారు.
మహబూబాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అక్కడున్నవి 300 కుటుంబాలే, మొత్తం జనాభా 1,650కి మించదు. కానీ ఆ ఊరిలో 150 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు. 50 మంది పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. వీళ్లను ఆదర్శంగా తీసుకొని మరో 50 మంది విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆ ఊరే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లా తండా. శాస్త్రవేత్తలు మొదలుకొని డాక్టర్లు, ఇంజినీర్ల దాకా.. కానిస్టేబుల్ మొదలుకొని ఐజీ దాకా.. బ్యాంకులు, అటవీ శాఖ, రైల్వే, విద్య, విద్యుత్తు తదితర శాఖల్లో చాప్లా తండా ఉద్యోగులున్నారు. గ్రామానికి చెందినవాళ్లు అమెరికా, కెనడా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 30 మందికి పైగా విదేశాల్లో స్థిరపడి ఉన్నత రంగాల్లో పనిచేస్తున్నారు. చాప్లా తండా నుంచి ఏటా ఐదారుగురు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ తండా వాసులు రాజకీయంగానూ రాణిస్తున్నారు. ఇక్కడి నుంచే డోర్నకల్కు ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ డైరెక్టర్లు, సింగిల్విండో చైర్మెన్లుగా పదవులు చేసినవారున్నారు.
గ్రామాభివృద్ధికి ఉద్యోగుల చేయూత
తండాకు చెందిన ఉద్యోగులు తమ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. గ్రామంలోని ఉద్యోగులందరితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే ఇందులో పోస్ట్ చేస్తే చాలు. ప్రతి ఉద్యోగి వారికి తోచినంత ఆర్థిక సహాయం చేస్తారు. అలా రూ.3 లక్షలతో గ్రామంలో ప్రతి వీధిలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హరితహారం కింద నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో నిర్మించిన గుడికి రూ.4 లక్షలు, పంచలోహ విగ్రహాలకు రూ.లక్ష మొత్తం రూ.5 లక్షలు ఉద్యోగులే ఇచ్చారు. వీళ్లంతా విధి నిర్వహణలో ఎక్కడున్నా ప్రతి సంక్రాంతికి మాత్రం వారంపాటు గ్రామంలోనే ఉంటారు.
మా ఇంట్లో ఇద్దరం ఉద్యోగులమే
మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాం. ఎన్ఐటీలో బీటెక్ చదివా. 2018లో ట్రాన్స్కో పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నా. మా అన్నదమ్ములిద్దరం ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నాం. మా సోదరుడు విద్యుత్తు శాఖలోనే ఏడీగా పని చేస్తున్నారు.
భూక్యా సంతోష్నాయక్, ఏఈ, విద్యుత్తు శాఖ
అందరూ విద్యావంతులే
మా తండాలో అంతా విద్యావంతులే. వివిధ ఉద్యోగాలల్లో స్ధిరపడ్డారు. మా తండాలో ఉన్న ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగం వచ్చిన ప్రతి ఉద్యోగి తండా అభివృద్ధికి సహకరిస్తున్నారు. చాప్లా తండా నుంచి శాస్త్రవేత్తగా, పోలీస్శాఖలో ఐజీ స్థాయికి ఎదిగినవారు కూడా ఉన్నారు.
గుగులోత్ రవినాయక్ , జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రతి ఉద్యోగి ఆర్థిక సహాయం
మా ఊరిలో 300 కుటుంబాలు ఉన్నాయి. మా తండా నుంచి 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. పోలీస్ శాఖలో ఎక్కువగా 34 మంది ఉన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు చేస్తున్నామంటే చాలు ప్రతి ఉద్యోగి తనవంతు ఆర్థిక సహాయం అందిస్తారు.
బానోతు పాండునాయక్, సర్పంచ్