హైదరాబాద్, సెప్టెంబర్ 23, (నమస్తే తెలంగాణ): కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని సుప్రీం కోర్టు పట్టుబట్టడంతో.. ఆ బాధ్యతను రాష్ర్టాలపైకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎక్స్గ్రేషియా చెల్లింపులో కేంద్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నదని రాష్ర్టాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరిహారం చెల్లింపు బాధ్యత రాష్ర్టాలదేనంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి ముందు తమను సంప్రదించకపోవడం సమాఖ్య స్ఫూర్తి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాయి.
కేంద్రం వైఖరిని పార్లమెంట్సభ్యులు తప్పుపడుతున్నారు. కొవిడ్ వల్ల రాష్ర్టాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో కేంద్రం నిర్ణయం సరైంది కాదని చెప్తున్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకోవడానికి తెలంగాణప్రభుత్వం ఇతరరాష్ర్టాల కంటే ముందే పేదలకు ఉచితంగా బియ్యం, రూ.15 వందలు నగదు చెల్లించి మార్గదర్శకంగా నిలిచిన తర్వాతే కేంద్రం మొక్కుబడిగా కుటుంబానికి రూ.500 చెల్లించింది. రాష్ర్టాలకు పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం నాడు ప్యాకేజీల ప్రకటనలతో కాలయాపన చేసింది. నేడు.. పరిహారాన్ని చెల్లించే పని రాష్ర్టాలపై మోపింది. ఇలాంటప్పుడు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమిటని ఎంపీలు నిలదీస్తున్నారు.
తెలంగాణకు రూ.2 వేల కోట్ల భారం
కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించే బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకొని రాష్ర్టాలపైకి నెట్టడాన్ని రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 2 వేల కోట్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య రాష్ట్రంలో ఇప్పటికే 3,900 పైచిలుకు నమోదైంది. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విధంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు చెల్లించాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతుంది. ఈ నిధులను రాష్ర్టాలు తమకు కేంద్రం ఇచ్చే కేటాయించే విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవచ్చని కేంద్రం అంటున్నది. ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు, వరదలు, భారీవర్షాలు వంటివి సంభవించినప్పడు తీసుకునే చర్యలకే ఈ నిధులు సరిపోవడం లేదు. ఈ మొత్తాన్ని పెంచాలని గతంలోనే అనేకమార్లు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్గ్రేషియాను కూడా ఈ నిధులతోనే ముడిపెట్టడమేమిటని రాష్ర్టాలు ప్రశ్నిస్తున్నాయి.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టుకు కేంద్రం ఏకపక్షంగా అఫిడవిట్ దాఖలు చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించక తప్పదని సుప్రీంకోర్టు మొదటి నుంచి చెబితే కేంద్రం పెడచెవిన పెట్టింది. చివరకు ఈ బాధ్యతను రాష్ర్టాలపైకి నెట్టి చేతులు దులుపుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అఫిడవిట్ దాఖలు చేయడానికి ముందే రాష్ర్టాలతో కేంద్రం చర్చించి ఉంటే బాగుండేది. ఎవరితో చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు.
నిధులు ఇస్తుందేమో చూడాలి..
కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించే బాధ్యత రాష్ర్టాలదేనని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిందంటే ఆ నిధులను రాష్ర్టాలకు చెల్లిస్తుందేమో వేచి చూడాలి. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చే ప్రకృతి విపత్తు సహాయనిధి నుంచే వాడుకోవాలంటే ఎలా కుదురుతుంది. అదనంగా ఎన్ని నిధులు ఇస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. ఈ నిధుల చెల్లింపుపై కేంద్రం నుంచి ఇంకా రాష్ర్టానికి మార్గదర్శకాలు అందలేదు.