హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రోటావైరస్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘రోటావ్యాక్ 5డీ’ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రాథమిక గుర్తింపు లభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ను శిశువులు, చిన్నపిల్లలకు రోటావైరస్ సోకకుండా వినియోగిస్తారు. రోటావైరస్ నియంత్రణకు భారత్ బయోటెక్ గతంలోనే రోటావ్యాక్ పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. దీనిని మరింత మెరుగుపరిచి తాజాగా రోటావ్యాక్-5డీని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపుతో ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. రోటావ్యాక్ 5డీకి డబ్ల్యూహెచ్వో గుర్తింపుపై భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా హర్షం వ్యక్తం చేశారు. వ్యాధి బారిన పడుతున్న పిల్లలను కాపాడాలన్న లక్ష్యంలో ఈ గుర్తింపు ఓ కీలక మలుపుగా పేర్కొన్నారు.