లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ)/రాంనగర్: మత్స్యశాఖలోని అవినీతి చేపలు ఏసీబీకి చిక్కారు. బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి లంచం తీసుకొంటున్న కరీంనగర్ మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్, సిరిసిల్ల జిల్లా ఇంచార్జి ఖదీర్ అహ్మద్, సిరిసిల్ల సీనియర్ అసిస్టెంట్ అంజయ్యను రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బండపల్లికి చెందిన నర్సయ్య మత్స్య సహకారం సంఘం ఏర్పాటుకు గత నెలలో దరఖాస్తు చేశా డు. మత్స్యశాఖ డీడీ ఖదీర్ అహ్మద్.. సీనియర్ అసిస్టెంట్ అంజయ్య ద్వారా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం సంఘానికి చెందిన జనార్దన్ను తీసుకొని నర్సయ్య సిరిసిల్ల మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ సీనియర్ అసిస్టెంట్ అంజయ్యకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని జనార్దన్కు సూచించాడు. అక్కడి నుంచి నర్సయ్య కరీంనగర్ మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లి డీడీ ఖదీర్అహ్మద్కు రూ.40 వేలు లంచం ఇస్తుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు నిందితులను పట్టుకున్నారు. విచారణ అనంతరం అంజయ్య, ఖదీర్ అహ్మద్ను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య
మా సర్వీసును క్రమబద్ధీకరించండి