కొత్తగూడెం క్రైం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50)కు ఏం జరిగింది..? ప్రస్తుతం ఆయన కరోనాతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకి గురైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే హరిభూషణ్ మరణించినట్లు ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉంది..? ఒకవేళ హరిభూషణ్ మరణిస్తే మావోయిస్టు వర్గాలు ఈ విషయాన్ని తెరమీదకి తీసుకురాకపోవడానికి గల కారణాలు ఏంటి..? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో జరిగిన పువ్వర్తి ఎదురు కాల్పులతో పాటు మరి కొన్ని సందర్భాల్లో హరిభూషణ్ ప్రాణలతో బయటపడ్డాడు. ఇటీవల తెలంగాణ – చత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్ లో హరిభూషణ్ కీలక పాత్ర పోషించాడు. ఏది ఏమైనప్పటికీ హరిభూషణ్ ఆరోగ్య స్థితిగతులపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.