మొదటి విడుత 296 కార్డులు మంజూరు
వర్ధన్నపేటలో 800కు పైగా దరఖాస్తులు
ఆనందంలో లబ్ధిదారులు
వర్ధన్నపేట, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నది. పేదలకు నిత్యావసర సరుకులను అందించేందుకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మండలాల వారీగా రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సివిల్ సప్లయ్ అధికారులు కార్డులను మంజూ రు చేస్తున్నారు. దరఖాస్తుదారులు అందుబాటులో ఉన్న మీసేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను తెలిపితే, ఆన్లైన్లో రేషన్కార్డును డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. ఏళ్ల తరబడి రేషన్కార్డులు లేని పేదలకు ప్రభు త్వం అందిస్తున్న బియ్యం, ఇతర సరుకులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కానీ, తెలంగాణ ప్రభు త్వం కొత్తరేషన్కార్డులను జారీ చేస్తుండడంతో పేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పేదలకు రేషన్కార్డులు మంజూరు కావడంతో ప్రజాప్రతినిధులు వాటిని అందజేస్తున్నారు.
800లకు పైగా దరఖాస్తులు
జిల్లాలోని ప్రతి మండలంలో వందల సంఖ్యలో పేదలు రేషన్కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్నట్లు జిల్లా సహకార సంస్థ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం తొలివిడుతగా అర్హులైనవారికి రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. వర్ధన్నపేట మండలంలో 803 మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 296 మంది అర్హులైన పేదలకు ప్రభుత్వం ఆన్లైన్లో రేషన్కార్డులను మంజూరు చేసింది. దీంతో గ్రామాల వారీగా పేదలు వారి దరఖాస్తుల ఆధారంగా మీసేవా కేంద్రాల్లో రేషన్కార్డులను తీసుకుంటున్నారు. ప్రభుత్వం దొడ్డు బియ్యమే కాకుండా సన్నబియ్యాన్ని కూడా రేషన్షాపులకు సరఫరా చేస్తుండడంతో పేదలకు మరింత ఉపయోగకరంగా ఉండనున్నది. మార్కెట్లో సన్నబియ్యం ధర రూ.35 వరకు పలుకుతోంది. కానీ రేషన్షాపుల ద్వారా ఒక రూపాయికే ప్రభుత్వం అందిస్తుండడంతో కొత్తగా కార్డులు పొందిన పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అర్హులైన పేదలకు రేషన్కార్డులను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.