నాలుగో రోజు ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దు
డబ్ల్యూటీసీ ఫైనల్
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను వరుణుడు వదిలేలా లేడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఇప్పటికే తొలి రోజు ఆట రద్దు కాగా.. సోమవారం భారీ వర్షం కారణంగా ఒక్క బంతీ సాధ్యపడలేదు. సంప్రదాయ క్రికెట్లో విశ్వ విజేతను తేల్చాలనే ఉద్దేశంతో ఐసీసీ ప్రవేశ పెట్టిన డబ్ల్యూటీసీ తొలి సీజన్లో ఇక ఫలితం తేలే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే నాలుగు రోజుల ఆట ముగిసిపోగా.. రిజర్వ్ డేతో కలిపి ఇక రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
సంయుక్త విజేత!
రెండు సెషన్ల పాటు ఎదురుచూసినా.. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో అంపైర్లు నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కీలక పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న కివీస్.. భారత్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. విలియమ్సన్ (12), టేలర్ (0) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆగి ఆగి సాగుతున్న ఈ మ్యాచ్లో ఫలితం తేలకపోతే.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించనున్నారు.
ఇంగ్లండ్లో వద్దు: పీటర్సన్
ముఖ్యమైన మ్యాచ్లను ఇంగ్లండ్లో నిర్వహించకపోవడమే మంచిదని ఆ దేశ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ వర్షాల కారణంగా చాలా మ్యాచ్లకు అంతరాయం వాటిల్లగా.. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కూడా దీనిపై తనదైన శైలిలో పంచ్లు వేశాడు. ‘టీమ్ఇండియా బ్యాట్స్మెన్కు సరైన టైమింగ్ దొరకలేదు.. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీకి సరైన టైమింగ్ లభించలేదు’ అని ట్వీట్ చేశాడు.