హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. ప్రగతిభవన్లో జరుగనున్న ఈ సమావేశంలో లాక్డౌన్ విధింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ర్టాల్లో లాక్డౌన్ విధించినా కరోనా అంతగా తగ్గటం లేదని, సరైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు లాక్డౌన్ కావాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధించటం వల్ల కలిగే సాధకబాధకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై లాక్డౌన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా సెకండ్వేవ్ భారతదేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలంటూ భారతీ య వైద్యుల సంఘం (ఐఎంఏ) నుంచి అటు అమెరికా అధ్యక్షుడి వైద్య సలహా దారు ఆంటోనీ ఫౌచీ వరకూ కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ అల్లక ల్లోలమవుతుందని, కూలీలు, కార్మికులు పనులు కోల్పోయి అల్లాడిపోతారని ఆర్థిక నిపుణులు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో, లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంటున్నది? అది నిజంగానే కరోనా వ్యాప్తిని అరికడుతున్నదా? ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుందా అన్న ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించనప్పటికీ.. పలు రాష్ర్టాలు ఇప్పటికే పూర్తిస్థాయి లాక్డౌన్నుగానీ, లాక్డౌన్ తరహా ఆంక్షలనుగానీ విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ కొంతకాలంగా పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలుపరుస్తున్నాయి. ఈ రాష్ర్టాల్లో దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. మహారాష్ట్రలో ఏప్రిల్ 22న లాక్డౌన్ తరహాలో కఠినమైన ఆంక్షలను ప్రకటించగా.. అనంతరం వాటిని ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలకు ముందు రోజైన ఏప్రిల్ 21న 67,468 కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్కరోజు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 568. ఆంక్షలను విధించి సోమవారానికి దాదాపు మూడు వారాలు కావస్తున్నది. సోమవారం కొత్త కరోనా కేసుల సంఖ్య 37,236గా నమోదైంది. మరణాలు కూడా ఆది, సోమవారాలు కలిపి 302 అని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో గత నెల 19 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నది. దానికి ముందు రోజు 24,852 కేసులు నమోదుకాగా.. సోమవారం ఢిల్లీలో 12,651 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో కేసులు తగ్గినప్పటికీ మరణాలు పెరిగాయి.
గత ఏడాది తరహాలో ప్రణాళికలేకుండా లాక్డౌన్ విధిస్తే దినసరి కూలీలు, చిరుద్యోగులు, చిన్నస్థాయి వ్యాపారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని, కాబట్టి, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొనే దేశవ్యాప్త లాక్డౌన్కు కేంద్రప్రభుత్వం యోచించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పాక్షిక లాక్డౌన్ను లేదా ఇటీవల లాక్డౌన్ను విధించిన రాష్ర్టాల్లో పరిస్థితులు ఒకే విధంగాలేవు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా కేసులు తగ్గగా, మరికొన్ని రాష్ర్టాల్లో కేసుల సంఖ్య పెరిగింది.
ప్రస్తుతం పూర్తిస్థాయి లాక్డౌన్ ఉన్న రాష్ర్టాలు
ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, కేరళ, తమిళనాడు, మిజోరాం, రాజస్థాన్, మణిపూర్
కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ విధించిన రాష్ర్టాలు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యూపీ, సిక్కిం, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్ -నేషనల్ డెస్క్
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. తక్షణం పూర్తిస్థాయి ప్రణాళికతో, ముందస్తు ప్రకటనతో దేశవ్యాప్త లాక్డౌన్ను విధించటం ఒక్కటే మార్గం. దీనివల్ల విపరీతమైన ఒత్తిడితో ఉన్న దేశ ఆరోగ్యరంగానికి ఊపిరి తీసుకోవటానికి సమయం లభిస్తుంది. అంతేకాకుండా కరోనా వైరస్ గొలుసును ఎక్కడికక్కడ విడగొట్టి.. ఆ వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గిస్తుంది. రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షల వల్ల ఫలితం ఉండదు. కరోనాను అరికట్టడంలో కేంద్ర ఆరోగ్యశాఖ చూపుతున్న నిర్లక్ష్యం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఇకనైనా నిద్రమత్తును వదిలించుకొని నిపుణుల మాట వినాలి.
-ఇండియన్ మెడికల్ అసోసియేషన్
లాక్డౌన్ వల్ల ఉపయోగమా? అనర్ధమా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక నిపుణులు మాత్రం లాక్డౌన్తో సాధించే ఫలితాల కన్నా, ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ క్రమశిక్షణతో కొవిడ్ నిబంధనలను నూటికి నూరుపాళ్లు పాటిస్తే లభించే లాభాలే ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. కరోనా తొలిదశలో లాక్డౌన్ విధించినప్పుడు తలెత్తిన ఘోర పరిణామాలకు యావత్ దేశం సాక్షిగా ఉన్నది. వందల కిలోమీటర్లు కాలినడకన బయల్దేరిన వలస కార్మికుల దుస్థితి నేటికీ కండ్లముందే కనిపిస్తున్నది. వాస్తవానికి ఇతర రాష్ర్టాల్లో చోటుచేసుకున్న వలసల కంటే.. తెలంగాణలో వలసలు తక్కువే. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులకు ఆర్థిక సహాయంతోపాటు, బియ్యం కూడా సరఫరా చేయడంతో కొంత భరోసా ఏర్పడింది. తెలంగాణ.. ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఉన్నది. ఇకడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. వీరంతా వెళ్లిపోతే తిరిగి రావడం కష్టం. ఇదొక అంశమైతే.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ఆర్థిక నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు ఉన్న పళాన లాక్డౌన్ విధిస్తే అందరికంటే ఎక్కువ ప్రభావితమయ్యేది రైతులు, ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములైన కష్టజీవులే. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్లు, మిల్లులకు తరలించే కూలీలు.. లక్షల మంది ఈ ప్రక్రియతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములై ఉన్నారు. వీరి ఉపాధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొవిడ్ నిబంధనలను అత్యంత కఠినంగా అమలుచేయడం అనేది లక్షల మంది బతుకులకు భరోసానిస్తుందని నిపుణులు అంటున్నారు. లాక్డౌన్తో ధాన్యం కొనుగోలు వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదమున్నదని అంటున్నారు. లాక్డౌన్తో జరిగే మేలు కంటే నష్టమే ఘోరంగా ఉండే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఒక విధంగా భయానక పరిస్థితి లాక్డౌన్తో మళ్లీ తలెత్తే ప్రమాదం ఉన్నదని అంటున్నారు.
ఐఎంఏ-తెలంగాణ విజ్ఞప్తి
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి లాక్డౌన్ విధించటమే ఉత్తమమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్రెడ్డి, అధ్యక్షుడు(ఎలక్ట్) బీఎన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 15 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గి, పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు. మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.