హైదరాబాద్ : ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఐటీఐఆర్ను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసి నిరుద్యోగానికి కారణమైందని అన్నారు.
‘‘సిలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. విభజన హామీలను సైతం తుంగలో తొక్కింది. గిరిజన వర్సిటీ, రైల్వే కోచ్ ఏర్పాటు ఏమయ్యాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నగరీకరణ, పట్టణీకరణకు ప్రోత్సాహం కరువైంది. ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు తెలంగాణ నీటివాటాను తేల్చలేదు’’ అని కేంద్రం తీరుపై ఆయన ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రజల బతుకుదెరువు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. పంజాబ్ను తలదన్ని రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.