కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సాకుతో దేశంలోని ఏ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయకపోయినా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లను కేటాయించారని చెప్పారు. సజావుగా సాగుతున్న కొనుగోళ్లను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మీ సేవా కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో స్థలం కొరత, ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇబ్బంది, హమాలీలు, ఆపరేటర్లు, కూలీల కొరత ఉన్నా.. అన్నింటినీ అధిగమిస్తూ అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో రూ.వెయ్యి ఇస్తామన్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 10 లక్షలమెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని.. మిగిలిన రాష్ర్టాల్లో కొనేవారే లేరని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మెట్రిక్టన్నుల ప్రొక్యూర్మెంట్ జరిగిందని, కానీ, తెలంగాణలో దిగుబడి రెండింతలు అయిందన్నారు. ఎఫ్సీఐతో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని అందులో 55 శాతం అంటే ఇప్పటికే 6.50 లక్షల మంది రైతుల నుంచి రూ.8,522 కోట్ల విలువైన 45.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని వివరించారు. అందులో రూ.4,523 కోట్లు చెల్లించామని చెప్పారు. ఇప్పటికే సేకరణ పూర్తయిన 150 కేంద్రాలను మూసివేశామని, జూన్ మొదటివారంలోగా కొనుగోలు మొత్తం పూర్తి అవుతుందని చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలున్నాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని గంగుల కోరారు.