న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వార్షిక టర్నోవర్ తొలిసారి లక్ష కోట్లకుపైగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.1,00,616 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఎయిర్టెల్ తెలిపింది. 2019-20లో రూ.84,676 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇక ఎయిర్టెల్ ఇండియా రెవిన్యూ 18 శాతం ఎగబాకి రూ.72,308.3 కోట్లుగా ఉంటే, ఎయిర్టెల్ ఆఫ్రికా రెవిన్యూ 19 శాతం ఎగిసి రూ.28,863.3 కోట్లుగా ఉన్నది. కాగా, సంస్థ ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చిలో రూ.759 కోట్లుగా నమోదైంది. పోయినసారి రూ.5,237 కోట్ల నష్టాలను చవిచూసింది. ఏకీకృత ఆదాయం 11.9 శాతం పుంజుకుని రూ.25,747 కోట్లకు చేరింది. 2019-20తో పోల్చితే 2020-21లో సంస్థ నష్టం రూ.32,183 కోట్ల నుంచి రూ.15,084 కోట్లకు తగ్గింది.