హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు రాష్ట్ర సర్కారు పూర్వవైభవం కల్పిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ కులవృత్తిదారులు ముందుకుసాగుతున్నారని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలోని వడ్డెర, కుమ్మరి కులవృత్తులపై సెస్ అధ్యయనం చేసింది. రాష్ట్ర జనాభాలో 1 శాతం చొప్పున వడ్డెర, కుమ్మరి కులస్థులున్నారు. జనాభా దామాషా ప్రకారం వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎలా ఉపయోపడుతున్నాయి? ఇంకా ఏం చేయాలి? ఆయా కులాల్లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి? తదితరాలపై అధ్యయనం చేసింది. కుమ్మరుల జీవన స్థితిగతులపై ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పరిధిలో, వడ్డెర కులస్థుల స్థితిగతులపై హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అధ్యయనం చేపట్టింది. వ్యవసాయ భూములున్నవారికి రైతుబంధు, అర్హులకు ఆసరా పింఛన్లు సక్రమంగా అందుతున్నాయని తేల్చిచెప్పింది. ఆరోగ్యశ్రీ కార్డులున్నవారు వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నది.