గుర్రంపోడు, ఏప్రిల్ 13 : సబ్బండ వర్గాల సంతోషమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, టీఆర్ఎస్తోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్న జానారెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. మంగళవారం గుర్రంపోడు మండలంలోని తెరాటిగూడెం, చేపూరు, వట్టికోడు, కొత్తలాపురం, కొప్పోలు, పిట్టలగూడెం, తేనెపల్లి, గుర్రంపోడు, పాశంవారిగూడెం, మొసంగి, పోచంపల్లికి చెందిన 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా సమీప గ్రామాలకు నీళ్లు ఇవ్వని ఘనత జానారెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జానారెడ్డికి గ్రామాలు గుర్తుకొస్తాయని, ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే రైతుల కష్టాలు తీరాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి యువకుడు, విద్యావంతుడైన నోముల భగత్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.